// విషాద పర్వం // భరతమాత ఎదురైనా బలికాక తప్పదేమో కనకదుర్గ కనిపించినా కాముకులు వదలరేమో ఆడతనమంటే అనునిత్యం ఆక్రందనమా అమ్మతనమంటే అఘాయిత్యాల సుడిగుండమా! పుణ్యభూమి నాదేశంలో పురుషాహంకారాలు దుర్యోధన దుశ్శాసన కీచకుల పర్వాలు అడుగడుగునా హత్యాచారాలై.. అతివల ఆక్రందనలు క్షణక్షణానికో రణం.. ఆరని జ్వాలాభారతం ప్రార్ధనా గీతాలు, మతగ్రంధాల నీతి బోధలూ భావి భారత ప్రతిజ్ఞలు.. ఏమయ్యాయమ్మా ? రాసిపెట్టిన రాజ్యాంగాలు, చేసిన సవరణలు శాసనసభల చట్టాలు, శాసించే సిద్దాంతాలు నినదించే నిర్భయలు, దిక్కుతోచని దిశలు ఎన్ని విషాదపర్వాలో.. ఎన్నెన్ని నిశీధి గీతాలో అయ్యో.. తల్లీ.. భరతమాతా ఇది విన్నావా? శక్తి ప్రతీక స్త్రీ అనేది ఒట్టి నానుడైయ్యిందమ్మా శక్తి విహీనం చేస్తున్న మృగతత్వపు మనిషి వికృతత్వం మకిలిపడ్డ మనసుల్లో.. కరుడుగట్టిన కఠినత్వంలో.. సిగ్గుదాచే తెరను లాగి గొంతు నొక్కినవైనం నిర్బంధించి వెన్నువిరిచి నాల్క కోసిన దారుణం తొడలమధ్యన "తొక్కిసలాట" కై నరకయాతనన పెట్టిన ఆటవికం ఎందుకమ్మా ఈ వైపరీత్యం.. ఏమిటమ్మా ఈ అరాచకం కలిమిలేముల మధ్య.. బలబలహీనతల చాటున చట్టాలకు చుట్టాలెవరో.. న్యాయదేవతకు చెప్పమ్మా కళ్ళగంతలు తీయమని.. అబద్ధపు పత్రాలను వినకనీ.. అర్ధరాత్రి రహస్యచితిలో బూడిదైన సత్యాన్ని వి(క)నమనీ.. నాలుగ్గోడల మధ్య వెలకిరాని ఉదంతాలెన్నో కరెన్సీ కాగితాలతో నోరునొక్కబడుతుంటే కొవ్వొత్తుల ప్రదర్శనలో.. కాగడా ర్యాలీలో మానవ హక్కుల పోరా పత్రికల్లో సానుభూతి వార్తలో.. మీడియా రేటింగులో.. అచ్చయిన కవితలో.. ఏదీ మార్చలేదా.. మురికి పట్టిన మస్తకాన్ని ? అజ్ఞానం నింపుకున్న మనిషి మనసు మారనిదే విషంచిమ్మి కాటువేసే కేటుగాళ్లపై వేటు పడనిదే మహిళకేది మనశ్శాంతి రగులుతున్న హృదయం అడుగుతుంది నిన్నే.. ఎన్ని మేనులిలా నేలపాలు కావాలని ఏదమ్మా స్త్రీ ఉనికని..
|
వరద బాధితులకు విజ్ఞాన్స్ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్ చాన్స్లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.