విజ్ఞాన్‌ యూనివర్సిటీలో 5జీ ల్యాబ్‌ ప్రారంభం

విజ్ఞాన్‌ యూనివర్సిటీలో 5జీ ల్యాబ్‌ ప్రారంభం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్ :
చేబ్రోలు మండలం వడ్లమూడి వద్ద ఉన్న విజ్ఞాన్‌ యూనివర్సిటీలో భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ (డీవోటీ) ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన 5జీ ల్యాబ్‌ – గ్లోబల్‌ డిజిటల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ ల్యాబ్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌  ఏ. రాబర్ట్‌ జే రవి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5జీ ల్యాబ్‌ ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌లు 5జీ సాంకేతికతలలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడమే కాకుండా, విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, స్మార్ట్‌ సిటీస్, లాజిస్టిక్స్, ఈ–గవర్నెన్స్‌ వంటి కీలక రంగాలలో నవీన ఆవిష్కరణలు మరియు అనువర్తనాలను అభివృద్ధి చేసే దిశగా ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు. ల్యాబ్‌లో పూర్తిస్థాయి 5జీ స్టాండలోన్‌ సెటప్‌ ఏర్పాటు చేయబడిందని, ఇందులో 5జీ సిమ్‌లు, డాంగిల్స్, ఐవోటీ గేట్‌వేలు, రౌటర్లు, అప్లికేషన్‌ సర్వర్లు మొదలైన పరికరాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇవి విద్యార్థులు, పరిశోధకులు ప్రయోగాలు చేయడానికి, పరిశోధన నిర్వహించడానికి లైవ్‌  5జీ వాతావరణం అందిస్తాయన్నారు. అంతేకాకుండా అకాడెమియా–ఇండస్ట్రీ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు, స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలు కి మద్దతు అందించబడుతుందన్నారు. అలాగే దేశం 6జీ సాంకేతికతకు సిద్ధమయ్యే దిశలో పునాది వేస్తుందని వెల్లడించారు. అదేవిధంగా, వర్చువల్‌ ల్యాబ్స్, ఆగ్మెంటెడ్‌ లెర్నింగ్, ఆన్‌లైన్‌ ప్రాక్టికల్స్‌ ద్వారా విద్యార్థులు ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుభవించగలరని చెప్పారు.  కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏపీ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం. శేషాచలం మాట్లాడుతూ 5జీ ల్యాబ్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు, విద్యార్థులు రియల్‌టైమ్‌లో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రాజెక్ట్‌ ఆధారిత లెర్నింగ్, లైవ్‌ డేటా అనలిటిక్స్‌ ద్వారా పరిశోధన మరింత బలోపేతం అవుతుందని వివరించారు. విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులు నూతన సాంకేతికతలలో ముందంజలో ఉండేందుకు ఈ 5జీ ల్యాబ్‌ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ‘‘ఇది పరిశోధన, ఆవిష్కరణ, పరిశ్రమ–విద్యా భాగస్వామ్యానికి కొత్త మార్గాలను తెరుస్తుంది. విద్యార్థులు, పరిశోధకులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు. విజ్ఞాన్స్‌ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ 2023 కేంద్ర బడ్జెట్‌లో చేసిన ప్రకటనకు అనుగుణంగా, భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్‌ శాఖ  దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యాసంస్థల్లో 100 ‘‘5జీ యూజ్‌ కేస్‌ ల్యాబ్స్‌’’ స్థాపించేందుకు ఒక దూరదృష్టి ప్రణాళికను ప్రారంభించిందన్నారు. భారత ప్రధానమంత్రి గారు 2023 అక్టోబర్‌ 27న ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ సందర్భంగా ఈ జాబితాను ప్రకటించినప్పుడు, విజ్ఞాన్స్‌ వర్సిటీ ఈ 100 సంస్థలలో ఒకటిగా ఎంపిక కావడం విశేష గౌరవ కారణమన్నారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పీఎంవీ రావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.